Telangana: ‘నేను లంచం తీసుకోను’ అంటూ బోర్డు పెట్టేసుకున్న అధికారి!

షార్ట్స్‌లో చూడండి
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటన ప్రభుత్వ అధికారులను ఉలిక్కి పడేలా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లంచం తీసుకోవాలంటేనే కొందరు ప్రభుత్వాధికారులు భయపడుతున్నారు. కొందరు నిజాయతీ గల అధికారులు తాము లంచం తీసుకోబోమనే విషయాన్ని తమ వద్దకు వచ్చే ప్రజలకు ఎలాగైనా తెలపాలని తాపత్రయ పడుతున్నారు. కరీంనగర్‌ ఎన్‌పీడీసీఎల్‌ సర్కిల్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న పోడేటి అశోక్‌ అనే అధికారి తాను లంచం తీసుకోను అని ఏకంగా బోర్డు పెట్టేసుకున్నారు.

కార్యాలయంలో తాను కూర్చునే కుర్చీ వెనక తెల్లటి అక్షరాల్లో ‘నేను లంచం తీసుకోను’ అంటూ తెలుగులో రాసి పెట్టుకోవడంతో పాటు ఆంగ్లంలో ‘అయామ్‌ అన్‌కరప్టెడ్‌’ అని రాసి పెట్టారు. అధికారుల నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ ఆయన అక్రమాలకు పాల్పడబోరని తెలుస్తోంది. నెల క్రితం ఈ బోర్డును ఏర్పాటు చేశానని ఆయన అంటున్నారు. ఆయన కుర్చీ వెనుక పెట్టుకున్న ఈ బోర్డుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Go Back to Shorts
Telangana
Ranga Reddy District
Karimnagar District

More Telugu News