East Godavari District: భార్యను ఎరగా చూపి ట్రాప్... రూ. 63 వేలు వదిలించుకున్నాక మేలుకున్న యువకుడు!

  • తూర్పు గోదావరి జిల్లాలో ఘటన
  • భార్యను పంపించి వీడియోలు తీసిన నిందితుడు
  • ఆపై వాటిని చూపి బెదిరింపులు

ఓ అమ్మాయిని ఎరగా చూపిన ముఠా, ఓ యువకుడి నుంచి డబ్బులు వసూలు చేయగా, చివరకు తాను మోసపోతున్నానన్న విషయాన్ని గమనించిన అతను, పోలీసులను ఆశ్రయించి, ముఠా ఆట కట్టించాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా, సామర్లకోటలో జరిగింది. పోలీసులు, బాధితుడు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, రాకేశ్, అశ్వని భార్యాభర్తలు. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ఇద్దరూ కలిసి మరో ఆరుగురు స్నేహితుల సాయంతో ప్లాన్ చేశారు.

గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన మణికంఠ రెడ్డి అనే వ్యక్తి వారికి దొరికాడు. అశ్వినితో మణికంఠ రెడ్డిని ట్రాప్ చేయించిన రాకేశ్, వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు తీయించాడు. ఆపై వాటిని చూపించి, మణికంఠను బెదిరించడం మొదలుపెట్టారు. ఓ మారు కిడ్నాప్‌ చేసి ఆభరణాలు కూడా దోచుకున్నారు. అతన్నుంచి డబ్బులు దండుకున్నారు. తాను మోసపోయానని భావించిన బాధితుడు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి, ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దుర్గారెడ్డి పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

More Telugu News