Nara Lokesh: కార్తీక్ కుటుంబ సభ్యులు చేస్తున్న న్యాయ పోరాటానికి అండగా ఉంటాను: నారా లోకేశ్

  • నెల్లూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త కార్తీక్ (23)  ఆత్మహత్య 
  • ఎస్సై వేధించాడని అతడి కుటుంబ సభ్యుల ఆరోపణ
  • పరామర్శించిన టీడీపీ నేత నారా లోకేశ్
  • వైకాపా, స్థానిక పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్యని వ్యాఖ్య
నెల్లూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త కార్తీక్ (23) ఇటీవల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వైసీపీ నేతలు‌ చెప్పినట్లు నడుచుకోవాలంటూ కార్తీక్ ను ఓ ఎస్సై వేధించాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్తీక్ కుటుంబ సభ్యులను టీడీపీ నేత నారా లోకేశ్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పరామర్శించారు.
 
ఈ విషయంపై నారా లోకేశ్ స్పందిస్తూ... 'నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గం, దగదర్తి గ్రామంలో వైకాపా నాయకులు, స్థానిక పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న టీడీపీ కార్యకర్త కార్తీక్ కుటుంబాన్ని పరామర్శించాను. కార్తీక్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది' అని ఆయన ట్వీట్ చేశారు.
 
'కార్తీక్ ఆత్మహత్యకి కారణం అయిన పోలీసులు, వైకాపా నాయకులకు శిక్ష పడే విధంగా కార్తీక్ కుటుంబ సభ్యులు చేస్తున్న న్యాయ పోరాటానికి నేను అండగా ఉంటాను' అని లోకేశ్ మరో ట్వీట్ లో తెలిపారు.
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News