Kumaram Bheem Asifabad District: ఫోన్ చేసి వేధించిన యువకుడు.. వివాహిత ఆత్మహత్య

షార్ట్స్‌లో చూడండి
ఓ యువకుడు అదే పనిగా ఫోన్ చేసి వేధిస్తుండడం, అది చూసి భర్త అనుమానించడంతో మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కుమురం భీం జిల్లా జైనూరు మండలంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కొండిబగూడ గ్రామానికి చెందిన రమాకాంత్-సోన్‌కాంబ్లె సీతాల్ (24) భార్యాభర్తలు. నాలుగేళ్ల క్రితం వీరికి వివాహమైంది.

అదే గ్రామానికి చెందిన యువకుడు బొడికే అనికేతన్ గత కొంతకాలంగా సీతాల్‌కు ఫోన్ చేసి వేధిస్తున్నాడు. దీంతో మరోసారి ఫోన్ చేయొద్దంటూ అతడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో మరింత రెచ్చిపోయిన యువకుడు సీతాల్‌పై రమాకాంత్‌కు లేనిపోనివి చెప్పాడు. అతడు చెప్పిన మాటలు నమ్మిన రమాకాంత్.. ఈ నెల 7న భార్యను నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

భర్త తనను వేధించడంతోపాటు, యువకుడు వేధింపులు ఆపకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన సీతాల్ పురుగుల మందు తాగి కుప్పకూలింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సీతాల్ పరిస్థితి విషమించడంతో గురువారం ప్రాణాలు విడిచింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Kumaram Bheem Asifabad District
woman
phone call
suicide

More Telugu News