పాకిస్థాన్ వీసా రెడీ.. కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్న సిద్ధూ

షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ నేత, టీమిండియా మాజీ ఆటగాడు నవజోత్ సింగ్ సిద్ధూకు పాకిస్థాన్ వీసా మంజూరు చేసింది. నవంబర్ 9న జరగనున్న కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాక్ ప్రభుత్వం సిద్ధూను ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో, జీ మీడియా సమాచారం ప్రకారం, పాకిస్థాన్ హై కమిషన్ ఆయనకు వీసాను మంజూరు చేసింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం సిద్ధూ వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది.

పాక్ వీసాతో వాఘా సరిహద్దు వద్ద సిద్ధూ పాకిస్థాన్ లో అడుగుపెడతారు. అయితే, రాజ్యాంగబద్ధమైన ఎమ్మెల్యే పదవిలో ఆయన ఉన్న నేపథ్యంలో, పాక్ లో అడుగుపెట్టడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు అనుమతించాలంటూ ఇంతకు ముందే భారత విదేశాంగశాఖకు సిద్దూ లేఖ రాశారు.

ఒక సిక్కుగా కర్తార్ పూర్ కారిడార్ కార్యక్రమానికి వెళ్లడాన్ని తాను ఒక గౌరవంగా భావిస్తున్నానంటూ విదేశాంగశాఖకు రాసిన లేఖలో సిద్ధూ పేర్కొన్నారు. తనను పాకిస్థాన్ ప్రభుత్వం వ్యక్తిగతంగా ఆహ్వానించిందని తెలిపారు.
Go Back to Shorts
Navjot Singh Sidhu
Kartarpur Corridor
Pakistan High Commission
Pakistan Visa

More Telugu News