Raghava Lawrence: బోరుబావిలో పడి అసువులు బాసిన సుజిత్ తల్లిదండ్రులకు హీరో రాఘవ లారెన్స్ విజ్ఞప్తి!

  • పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడంలేదన్న లారెన్స్
  • చిన్నారి తల్లిదండ్రులు మరో పిల్లాడిని దత్తత తీసుకుంటే చదివిస్తానని వెల్లడి
  • సుజిత్ దేశ ప్రజల గుండెల్లో బతికే ఉన్నాడని కామెంట్

కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ తన పుట్టినరోజున గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల తమిళనాడులో బోరుబావిలో పడి మృతిచెందిన చిన్నారి సుజిత్ తల్లిదండ్రులకు ఒక విన్నపం చేశారు. దేశంలో తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతోమంది వున్నారని, అటువంటి వారిలో ఒకరిని దత్తత తీసుకోమని కోరారు. సుజిత్ పేరునే ఆ పిల్లవాడికి పెట్టమని విజ్ఞప్తి చేశారు. ఆ బాలుడి విద్యకయ్యే ఖర్చును తానే భరిస్తానని తెలిపారు. 

ఈనెల 25న తమిళనాడులోని తిరుచ్చిలో రెండేళ్ల బాలుడు సుజిత్ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోగా, అధికారులు బాలుడిని రక్షించాలని నాలుగురోజులపాటు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. బిడ్డను కోల్పోయిన సుజిత్ తల్లిదండ్రులకు లారెన్స్ సానుభూతి తెలియజేశారు. సుజిత్ ఎక్కడికీ పోలేదని, దేశ ప్రజల గుండెల్లో బతికే ఉన్నాడని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈరోజు తన పుట్టిన రోజు అయినప్పటికీ తాను సెలబ్రేట్ చేసుకోవడంలేదని వెల్లడించారు. 


More Telugu News