Crime News: భార్య ఇంటికి రాలేదట.. బావమరుదుల బండ్లు తగలెట్టేశాడు!

  • మద్యానికి బానిసై భార్యను వేధిస్తున్న భర్త
  • పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదని అక్కసు
  • ఇంటి బయట పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలకు మంట
పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగిరాలేదన్న కోపంతో బావమరుదుల ద్విచక్ర  వాహనాలను తగలబెట్టాడో ప్రబుద్ధుడు. ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం  ప్రకారం.. జియాగూడకు చెందిన సంతోష్ (36), బోరబండకు చెందిన సబిత భార్యాభర్తలు. పదేళ్ల క్రితం వీరికి వివాహం జరగ్గా ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన సంతోష్ డబ్బుల కోసం నిత్యం భార్యను వేధించేవాడు. అతడి వేధింపులు రోజురోజుకు ఎక్కువ కావడంతో విసుగు చెందిన సబిత నెలన్నర కిందట బోరబండ, శ్రీరాంనగర్‌లోని పుట్టింటికి వెళ్లిపోయింది.

భార్యను తిరిగి ఇంటికి రమ్మని పిలిచినా రాకపోవడంతో కక్ష పెంచుకున్న సంతోష్ ఆదివారం అర్ధ రాత్రి అత్తారింటికి వెళ్లాడు. ఇంటిబయట బావమరుదులు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. మంటల ధాటికి సమీపంలో పార్క్ చేసిన ఓ కారు కూడా పాక్షికంగా దెబ్బతింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Crime News
Hyderabad District
borabanda

More Telugu News