సత్య నాదెళ్లకు సానుభూతి తెలిపిన చంద్రబాబు, లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు పితృవియోగం కలిగిన సంగతి తెలిసిందే. ఆయన తండ్రి బీఎన్ యుగంధర్ అనారోగ్యంతో ఇవాళ కన్నుమూశారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తండ్రి యుగంధర్ మరణం బాధాకరం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

పీవీ నరసింహారావు పాలనలో గ్రామీణాభివృద్ధి శాఖలో యుగంధర్ ప్రవేశపెట్టిన సంస్కరణలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలు అని కీర్తించారు. యుగంధర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని ట్వీట్ చేశారు.

అటు, నారా లోకేశ్ స్పందిస్తూ, బీఎన్ యుగంధర్ మృతి వార్త తెలిసి దిగ్భ్రాంతి చెందినట్టు ట్విట్టర్ లో వెల్లడించారు. సమర్థుడైన అధికారిగానే కాకుండా, ఓ తండ్రిగా కూడా ఆయన జీవన సాఫల్యత సాధించారని లోకేశ్ కొనియాడారు. యుగంధర్ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
Go Back to Shorts
Satya Nadella
Chandrababu
Nara Lokesh
Microsoft

More Telugu News