tower car derailed: టవర్‌ కార్‌ పట్టాలు తప్పడంతో.. నిలిచిపోయిన పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

  • మధిర స్టేషన్‌లో ఆగిపోయిన శాతవాహన ఎక్స్‌ప్రెస్‌
  • ఎర్రుపాలెంలో నిలిచిపోయిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌
  • రాకపోకలకు అంతరాయంతో ప్రయాణికులకు ఇబ్బందులు

టవర్‌ కార్‌ ఒకటి పట్టాలు తప్పిన ఘటన కారణంగా సికింద్రాబాద్‌-విజయవాడ మధ్య తిరిగే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిర్వహణ పనుల కోసం వినియోగించే ఓ టవర్‌ కార్‌ ఖమ్మం జిల్లా బోనకల్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు బ్రేక్ పడింది. ఈ కారణంగా గుంటూరు-సికింద్రాబాద్‌ మధ్య రాకపోకలు జరిపే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ ఎర్రుపాలెంలో నిలిచిపోయింది.

 అలాగే, విజయవాడ-సికింద్రాబాద్‌ మధ్య తిరిగే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ మధిర రైల్వేస్టేషన్‌లో నిలిచిపోయింది. మరికొన్ని రైళ్ల రాకపోకలకు అంతరాయం నెలకొంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. రాకపోకలకు అంతరాయం లేకుండా చూసేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు.

More Telugu News