Telugudesam: టీడీపీ తలపెట్టిన ‘ఛలో ఆత్మకూరు’కు అమనుతి లేదు: మంత్రి సుచరిత

  • 2014-19 వరకు ఆరు రాజకీయ హత్యలు జరిగాయి
  • 2019 ఎన్నికల తర్వాత ఎక్కడా ఇలాంటివి జరగలేదు
  • పెయిడ్ ఆర్టిస్టులతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు
టీడీపీ కార్యకర్తలు, నాయకులపై వైసీపీ చేస్తున్న దాడులను నిరసిస్తూ ఈ నెల 11న ‘ఛలో ఆత్మకూరు’ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. అయితే, టీడీపీ తలపెట్టిన ఈ కార్యక్రమానికి అనుమతి లేదని ఏపీ హోం మంత్రి సుచరిత స్పష్టం చేశారు.

ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, అనుమతి ఇవ్వాలని ఎవరైనా అడిగితే పరిశీలిస్తామని చెప్పారు. పల్నాడులో తమ కార్యకర్తలు, నాయకులపై భౌతికదాడులు జరిగాయని టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. 2014-19 వరకు ఆరు రాజకీయ హత్యలు జరిగాయని, 2019 ఎన్నికల తర్వాత ఎక్కడా ఇలాంటి హత్యలు జరగలేదని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని అన్నారు.

పెయిడ్ ఆర్టిస్టులతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని టీడీపీపై ఆమె విరుచుకుపడ్డారు. ఈ కేంద్రాల్లో ఉన్నవాళ్లు ఎవరనేది తేల్చేందుకు నిజనిర్ధారణ చేస్తామని, అక్కడికి వెళ్లి అసలైన బాధితులు, పెయిడ్ ఆర్టిస్టులను గుర్తిస్తామని చెప్పారు. నిజమైన బాధితులుంటే వారిని తమ గ్రామాలకు తీసుకెళ్లి ప్రశాంతంగా జీవించేలా చర్యలు చేపడతామని ప్రకటించారు.
Telugudesam
Chalo Aatmakur
Minister
mekatoti

More Telugu News