Andhra Pradesh: గ్రామ సచివాలయం అభ్యర్థులకు శుభవార్త.. 4 మార్కులు అదనంగా కలపనున్న అధికారులు!

  • ప్రవేశపరీక్షలో నాలుగు తప్పుడు ప్రశ్నలు
  • గ్రామ సచివాలయం, డిజిటల్ అసిస్టెంట్ అభ్యర్థులకు చెరో రెండు మార్కులు
  • నిర్ణయం తీసుకున్న ఏపీ అధికారులు

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయం పరీక్షలు రాసిన అభ్యర్థులందరికీ శుభవార్త. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు అందరికీ 2 మార్కులు కలపాలని అధికారులు నిర్ణయించారు. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–5, మహిళా పోలీసు, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ పోస్టులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపారు. ఈ పరీక్షల్లో రెండు ప్రశ్నల్లో తప్పులు దొర్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

4,465 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు మొత్తం 11,62,164 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ‘కీ’ని అధికారులు నిన్న విడుదల చేశారు. మరోవైపు ఈ నెల 1న జరిగిన డిజిటల్ అసిస్టెంట్ పరీక్షలో కూడా 2 ప్రశ్నల్లో తప్పులు దొర్లినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ 2 మార్కులు కలపాలని నిర్ణయించారు. ఈ ప్రశ్నలకు గానూ అభ్యర్థులు ఏ జవాబును పెట్టినా పూర్తి మార్కులు ఇస్తామని పేర్కొన్నారు.

More Telugu News