టీడీపీ గేమ్ ప్లాన్ లో భాగంగానే పవన్ వ్యవహరిస్తున్నారు!: విజయసాయి రెడ్డి

తెలుగుదేశం పార్టీ చేతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ కీలుబొమ్మలా మారిపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన వరుస ట్వీట్లు పెట్టారు. "ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన దురాగతాల పట్ల స్పందించకుండా పవన్ కల్యాణ్ జ్ఞానిలా మౌనంగా వున్నారు. ఇప్పుడు టీడీపీ గేమ్ ప్లాన్ లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని విమర్శిస్తున్నారు. పవన్ చంద్రబాబు చేతిలోని మనిషి అన్న విషయం బహిరంగ రహస్యమే" అని అన్నారు.

ఆపై "ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వసూలయ్యే పన్నును ఆదా చేసేలా సాగుతున్నాయి. పారదర్శకతపై దేశానికే ఆదర్శంగా నిలిచి, ఓ దిశను చూపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో చౌకబారు ప్రచారం కోసం కాకుండా పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తులు ఏదైనా విమర్శలు చేసేటప్పుడు ముందూ, వెనుకా ఆలోచించాలి" అని కూడా విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు.


More Telugu News