Tirumala: తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ పూర్తిగా నిలిపివేత!

  • ఇక తిరుపతిలో మాత్రమే టోకెన్ల జారీ
  • రద్దీని తగ్గించేందుకేనన్న అధికారులు
  • తిరుమలలో రద్దీ సాధారణం
తిరుమలలో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా నిలిపివేసింది. గడచిన ఏడాదిన్నరగా తిరుమలతో పాటు తిరుపతిలోనూ ప్రత్యేక కేంద్రాల ద్వారా ఈ టోకెన్లను జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శనం కోసం వచ్చే భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని, టోకెన్ల కేంద్రాల వద్దే బారులు తీరి ఉంటుండటంతో దశలవారీగా తిరుమలలోని ఈ సెంటర్లను మూసి వేయాలని టీటీడీ గతంలోనే నిర్ణయించింది. తిరుమలలో రద్దీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని కూడా వెల్లడించింది. 

ఈ నేపథ్యంలో ఇకపై తిరుపతిలోని కేంద్రాల్లో మాత్రమే టైమ్ స్లాట్ టోకెన్లు లభ్యమవుతాయని, తిరుమలలోని అన్ని కేంద్రాలనూ మూసివేశామని టీటీడీ ప్రకటించింది. కాగా, తిరుమలలో ఈ ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి కేవలం 4 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి చూస్తున్న పరిస్థితి. సాధారణ సర్వదర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. నిన్న మంగళవారం నాడు స్వామివారిని 63,580 మంది దర్శించుకున్నారని, హుండీ ఆదాయం రూ. 2.98 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
Tirumala
Tirupati
Sarvadarshanam
Tokens
TTD

More Telugu News