Andhra Pradesh: ఇది ప్రభుత్వం సృష్టించిన విపత్తు: చంద్రబాబు

  • గుంటూరు జిల్లాలో వరద బాధితులకు పరామర్శ
  • ఓ పద్ధతి ప్రకారం నీటిని వదిలితే సమస్య ఉండేది కాదు
  • యాభై వేల ఎకరాల్లో పంట నీట మునిగింది
కృష్ణా నది వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందర్శించారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని కిష్కిందపాలెం, భట్టిప్రోలు మండలంలోని వెల్లటూరులో ఈరోజు ఆయన పర్యటించి, బాధితులను పరామర్శించారు. అనంతరం, కిష్కిందపాలెంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇది ప్రభుత్వం సృష్టించిన విపత్తు అని, ఓ పద్ధతి ప్రకారం నీటిని దిగువకు వదిలితే సమస్యలు తలెత్తేవి కావని అన్నారు.

యాభై వేల ఎకరాల్లో పంట నీట మునిగిందని, వరదలు సంభవించి వారం రోజులు దాటినా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల కారణంగా నష్టపోయిన రైతులు నిలదొక్కుకునే వరకూ వారికి అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఉండటం లేదని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకూ టీడీపీ పోరాడుతుందని, వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Andhra Pradesh
Guntru
Telugudesam
Chandrababu

More Telugu News