Gavaskar: తమ మధ్య విభేదాలు లేవని కోహ్లీ, రోహిత్ ఎంత మొత్తుకున్నా ప్రయోజనంలేదు: గవాస్కర్

షార్ట్స్‌లో చూడండి
ఇటీవల వరల్డ్ కప్ ముగియగానే భారత క్రికెట్ వర్గాల్లో ఓ అంశం విపరీతంగా చర్చకు వచ్చింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య పొసగడంలేదంటూ మీడియాలో కథనాలు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. టీమిండియాలో లుకలుకలా అంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల మధ్యే భారత జట్టు విండీస్ పర్యటనకు వెళ్లింది. దీనిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, మరో 20 ఏళ్లు గడిచినా కోహ్లీ, రోహిత్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ కథనాలు వస్తూనే ఉంటాయని, వాటికి అడ్డుకట్ట వేయడం కష్టమని అభిప్రాయపడ్డారు.

రోహిత్ పొరబాటున తక్కువ స్కోరుకే అవుటయ్యాడంటే, రోహిత్ కావాలనే అవుటయ్యాడంటూ కోహ్లీకి చాడీలు చెప్పేవాళ్లు తయారవుతుంటారని అన్నారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని కోహ్లీ, రోహిత్ ఎంత మొత్తుకున్నా ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదని గవాస్కర్ విశ్లేషించారు. ఇలాంటి ఊహాగానాలు, కథనాలు పుట్టించే వారి వల్ల భారత క్రికెట్ కు ఎలాంటి మేలు జరగకపోగా, జట్టు స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని సన్నీ ఆందోళన వ్యక్తం చేశారు.

మీడియాకు కావాల్సింది కూడా ఇలాంటి కథనాలే అని, క్రికెట్ ఆడుతున్నప్పుడు ఈ ప్రచారం తగ్గుముఖం పట్టినా, విరామ సమయాల్లో మాత్రం మళ్లీ తెరపైకి వస్తుంటుందని అన్నారు. కానీ, కోహ్లీ, రోహిత్ ఇద్దరూ ప్రొఫెషనల్ ఆటగాళ్లని, జట్టు గెలుపు కోసమే ఆడతారని కితాబిచ్చారు.
Go Back to Shorts
Gavaskar
India
Cricket
Virat Kohli
Rohit Sharma

More Telugu News