Team India: రెండో టీ20లోనూ భారత్‌దే విజయం.. సిరీస్ కైవసం

  • వర్షం కారణంగా ఆగిన మ్యాచ్
  • డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 22 పరుగుల తేడాతో భారత్ విజయం
  • ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా కృనాల్ పాండ్యా

వెస్టిండీస్‌తో ఫ్లోరిడాలో నిన్న జరిగిన రెండో టీ20లోనూ భారత్ విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ (67) చెలరేగిపోవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ 23, కోహ్లీ 28, కృనాల్ పాండ్యా 20 పరుగులు చేశారు.

అనంతరం 168 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ తన బ్యాటింగ్ తీరును ఏమాత్రం మార్చుకోలేదు. ఆటగాళ్లు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనక్కి తిరిగారు. 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్‌‌ను నికోలస్ పూరన్ (19), రోవ్‌మన్ పావెల్ (54) ఆదుకున్నారు. దీంతో పుంజుకున్నట్టే కనిపించింది. అయితే, 84 పరుగుల వద్ద వెంటవెంటనే వీరిద్దరూ పెవిలియన్ చేరడంతో మరోమారు కష్టాల్లో కూరుకుపోయింది.

అయితే, 15.3 ఓవర్ల వద్ద వర్షం ప్రారంభం కావడంతో ఆటను నిలిపివేశారు. అప్పటికి విండీస్ స్కోరు 98/4. మ్యాచ్‌ను తిరిగి కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ విధానంలో భారత జట్టు 22 పరుగుల తేడాతో విజయం సాధించినట్టు ప్రకటించారు. 13 బంతుల్లో 2 సిక్సర్లతో 20 పరుగులు చేయడంతోపాటు బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన కృనాల్ పాండ్యాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మూడో టీ20 6న గయానాలో జరగనుంది.

More Telugu News