ఓ వివాహిత అదృశ్యం వెనుకా రవిశేఖర్?
- అతనితో ఒంగోలులో కనిపించినట్లు సమాచారం
- వారం క్రితం అదృశ్యమైన గాజులరామారానికి చెందిన ఊహశ్రీ
- రవిశేఖర్పైనే తల్లిదండ్రుల అనుమానం
ఎస్బీఐ కాలనీకి చెందిన నాగరాజు, అరుణ దంపతుల కుమార్తె ఊహశ్రీని హైదరాబాద్లోని గాజులరామారం ప్రాంతానికి చెందిన నాగరాజు, శాంతమ్మ దంపతుల కుమారుడు మురళితో రెండేళ్ల క్రితం పెళ్లి చేశారు. కొన్ని రోజుల తర్వాత మురళి ఉద్యోగరీత్యా ఖత్తార్కు వెళ్లడంతో ఊహశ్రీ అత్తమామల వద్దే ఉంటోంది. ఆరోగ్యం సరిలేక కొంత కాలం క్రితం అత్త చికిత్స నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లింది. మామ నాగరాజుతో కలిసి ఊహశ్రీ ఆ ఇంట్లోనే ఉంటోంది.
గత నెల జూలై 5న ఉద్యోగ విధుల్లోకి వెళ్లిన మామ నాగరాజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఊహశ్రీ కనిపించలేదు. సమీప బంధువులను విచారించినా ప్రయోజనం లేకపోవడంతో జీడిమెట్ల పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపధ్యంలో తమ కుమార్తెను రవిశేఖర్ ట్రాప్ చేసి ఉంటాడని ఊహశ్రీ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు.