Maharashtra: మహారాష్ట్రలో పన్నెండు నిమిషాల వ్యవధిలో నాలుగుసార్లు భూప్రకంపనలు!

  • అర్ధరాత్రి 1.03 నిమిషాలకు తొలిసారి ప్రకంపనలు
  • ఆ తర్వాత వరుసగా మరో మూడుసార్లు
  • మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో ఘటన

అర్ధరాత్రి దాటాక భూమి పన్నెండు నిమిషాల వ్యవధిలో నాలుగుసార్లు కంపించడంతో స్థానిక జనం హడలిపోయారు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లా దహను కేంద్రంగా ఈ భూకంపం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

వివరాల్లోకి వెళితే...నిన్న అర్ధరాత్రి దాటాక ఒంటి గంటా మూడు నిమిషాలకు తొలిసారి భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 3.6గా నమోదయింది. ఆ తర్వాత 1.15 గంటల మధ్య మరో మూడుసార్లు భూ ప్రకంపనలతో ఆ ప్రాంతం వణికింది. తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై వరుసగా 3.6, 2.9, 2.8గా నమోదయింది.

భూకంపం తీవ్రతకు ఓ ఇంటి గోడ కూలిపోవడంతో దాని కింద చిక్కుకుని 55 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఓ వైపు భూ ప్రకంపనలు వణికిస్తున్నా, నిన్న రాత్రి నుంచి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జనం బయటకు రాలేకపోయారు. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే గడిపారు.

More Telugu News