Jashit: బ్రేకింగ్... కిడ్నాపైన బాలుడు జషిత్ క్షేమం... వదిలేసి వెళ్లిపోయిన కిడ్నాపర్లు!

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన జషిత్ కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది. బాలుడిని అపహరించుకు వెళ్లిన కిడ్నాపర్లు, రాయవరం మండలం కుతుకులూరు వద్ద ఈ తెల్లవారుజామున బాలుడిని వదిలేసి వెళ్లారు. ఆ వెంటనే బాలుడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

తూర్పు గోదావరి జిల్లా మండపేటలోని విజయలక్ష్మి నగర్‌ లో సోమవారం రాత్రి, తన నానమ్మతో ఆడుకుంటుండగా, జషిత్ అపహరణకు గురైన సంగతి తెలిసిందే. ఆపై పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి, బాలుడి కోసం విస్తృతంగా గాలించారు. పోలీసులు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించడం, జిల్లా అంతటా తనిఖీలు చేస్తుండటంతో, సోదాలతో భయపడిపోయిన కిడ్నాపర్లు, బాలుడిని వదిలి వెళ్లినట్టు తెలుస్తోంది.

చిన్నారి జషిత్‌ ను మండపేట పోలీస్‌ స్టేషన్‌ కు తీసుకొచ్చారు. ఆపై విషయం తెలుసుకున్న జషిత్ తల్లిదండ్రులు ఆనందంతో స్టేషన్ కు వచ్చి బాలుడిని అక్కున చేర్చుకున్నారు. జషిత్ ను చూసిన అతని తల్లి వల్లి, కన్నీటితో గుండెలకు హత్తుకుంది. జషిత్ తిరిగి కనిపించడం వెనుక, ప్రజల పాత్ర చాలా ఉందని, వ్యక్తిగత కారణాలే బాలుడి అపహరణకు కారణమని జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. కిడ్నాపర్లను పట్టుకుంటామని అన్నారు.
Go Back to Shorts
Jashit
Kidnap
East Godavari District
Police

More Telugu News