మహిళలకు అవకాశమిస్తే ఎలా రాణిస్తారన్నది జగన్ ఇంట్లో ఆయన పెద్దకూతురే నిరూపించారు: వైసీపీ ఎమ్మెల్యే రోజా
ఏపీలోని తమ ప్రభుత్వం ‘మహిళా పక్షపాతి ప్రభుత్వం’ అని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈరోజు శాసనసభలో ఆమె మాట్లాడుతూ, ఈ విషయాన్ని జగన్ ప్రతి సందర్భంలోనూ నిరూపిస్తున్నారని, అందులో ఎటువంటి సందేహం లేదని అన్నారు. ‘మా నాయకుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అందులో పెద్దమ్మాయి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సీటు సంపాదించి చదువుతున్నారు. అది ఎంత ప్రతిష్టాత్మకమైన కాలేజో, ఎలాంటి స్టూడెంట్స్ అక్కడ చదువుతారో మనందరికి తెలుసు. ఈ దేశంలోనే అతి తక్కువ మందికి దక్కే సీటును జగనన్న కూతురు దక్కించుకుని, ఆయన ప్రతిష్టను పెంచింది.మహిళలకు అవకాశమిస్తే ఎలా రాణిస్తారన్నది, ఆయన(జగన్) ఇంట్లో ఆయన పెద్దకూతురే నిరూపించారు. అది ఆయన ఆదర్శంగా తీసుకుని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్లను తన బిడ్డలా, చెల్లెలిలా, అక్కలా, తల్లిలా గౌరవిస్తూ, అన్నింట్లో సమాన అవకాశాలు ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగిందని, జగన్ కు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు.