Abhishek Manu Singhvi: ముందు ఎమ్మెల్యేల రాజీనామాలపైన, తర్వాత అనర్హతపైనా నిర్ణయం తీసుకోండి!: కర్ణాటక స్పీకర్ కు సుప్రీంకోర్టు ఆదేశం

షార్ట్స్‌లో చూడండి
తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించకపోవడంతో కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలంతా సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వీరి పిటిషన్లపై నేడు విచారణ జరిగింది. దీనిలో భాగంగా దాదాపు గంట పాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. రెబల్ ఎమ్మెల్యేల తరుపున సీనియర్ న్యాయమూర్తి ముకుల్ రోహత్గి, స్పీకర్ తరుపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ కావాలనే ఆమోదించట్లేదంటూ రోహత్గి ఆరోపించారు.

రోహిత్గి చెప్పిన విషయాలన్నీ అవాస్తవమని, న్యాయస్థానానికి స్పీకర్ విచక్షణాధికారాల్లో జోక్యం చేసుకునే అధికారం లేదని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు. కర్ణాటక అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా వచ్చి రాజీనామా ఇస్తేనే ఆమోదించదగినదిగా పరిగణిస్తారని తెలిపారు. ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా కలవకుండానే ముంబయి వెళ్లి అక్కడి నుంచి సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. న్యాయస్థానం ఆదేశించిన అనంతరం మాత్రమే 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి రాజీనామాలు సమర్పించారని, అయితే అప్పటికే వారిపై అనర్హత పిటిషన్లు వచ్చాయని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో స్పీకర్ అనర్హత వేటుకే తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని సింఘ్వి తన వాదనను వినిపించారు. ఇరు వాదనలు విన్న అనంతరం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయి స్పందిస్తూ, తొలుత రాజీనామాలపై వారం లోగా నిర్ణయం తీసుకోవాలని, ఆ తర్వాత అనర్హత అంశాన్ని పరిశీలించాలని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన సింఘ్వీ.. కోర్టు ఇలా చెప్పడం సరికాదని, ఒకవేళ కోర్టు ఆదేశిస్తే మాత్రం రేపటిలోగా రాజీనామాలు, అనర్హతపై స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
Go Back to Shorts
Abhishek Manu Singhvi
Rohatgi
Ranjan Gogoi
Supreme Court
Rebel MLA
Speaker

More Telugu News