GV Harshakumar: కేంద్రం ఎస్సీ వర్గీకరణకు ప్రయత్నాలు చేస్తోంది: మాజీ ఎంపీ హర్షకుమార్ ఆందోళన

  • కేంద్ర సామాజిక, న్యాయ శాఖ మంత్రిని కలిసిన హర్షకుమార్
  • ఎస్సీ వర్గీకరణ తీవ్రమైన అంశం అంటూ వ్యాఖ్యలు
  • ఏపీలో జగన్ వైఖరి తెలపాలంటూ డిమాండ్
దేశంలో ఇప్పటికీ పరిష్కృతం కాని అంశాల్లో ఎస్సీ వర్గీకరణ అంశం కూడా ఒకటి. కోట్లమంది రిజర్వేషన్లు ప్రభావితమయ్యే అంశం కావడంతో ప్రభుత్వాలు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. తాజాగా, ఈ అంశంపై మాజీ ఎంపీ హర్షకుమార్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ప్రయత్నాలు చేస్తోందంటూ ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ఎస్సీ వర్గీకరణ అంశం చాలా తీవ్రమైనదని హెచ్చరించారు.

ఎస్సీ వర్గీకరణ విషయంలో అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే ముందడగు వేయాలని స్పష్టం చేశారు. కేంద్రంలోని ఎస్సీ ఎంపీలందరూ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని హర్షకుమార్ చెప్పుకొచ్చారు. ఏపీలో కూడా ఎస్సీ వర్గీకరణపై జగన్ ప్రభుత్వం తన వైఖరి తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర సామాజిక, న్యాయ శాఖ మంత్రి ధావర్ చంద్ ను కలిసిన అనంతరం హర్షకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవలే ఎమ్మార్పీస్ ప్రకాశం జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయగా, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి హాజరై మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో హర్షకుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
GV Harshakumar
Andhra Pradesh
Jagan

More Telugu News