Andhra Pradesh: మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్!

షార్ట్స్‌లో చూడండి
టీవీ9 సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్ తాజాగా మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీసులు మోసం, ఫోర్జరీ అభియోగాలతో తనపై నమోదు చేసిన మూడు కేసులను కొట్టివేయాలని కోర్టును కోరారు. దురుద్దేశంతోనే తనపై ఈ కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ మేరకు తనపై నమోదయిన మూడు కేసులకు గానూ 3 పిటిషన్లను దాఖలు చేశారు.

ఇందులో ప్రతివాదులుగా  తెలంగాణ ప్రభుత్వం, అలందా మీడియాను చేర్చారు. హరియాణా వర్సెస్‌ భజన్‌లాల్‌ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు తనపై కేసు పెట్టారని రవిప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ఎలాంటి ఆధారాలను అధికారులు చూపలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా తాను పాతతేదీతో షేర్లను విక్రయించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించానని మోపిన అభియోగాల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు.

అవాస్తవాలు, ఊహాజనిత ఆరోపణలతో పెట్టిన ఈ కేసులను కొట్టివేయాలని ధర్మాసనాన్ని కోరారు. అలందా మీడియా ఫిర్యాదు నేపథ్యంలో రవిప్రకాశ్ పై ఫోర్జరీ, కంపెనీ లోగోను చవకగా అమ్మేయడం, నకిలీ పత్రాల సృష్టి తదితర అభియోగాల కింద కేసులు నమోదుచేశారు. అప్పట్లో  బెయిల్ కోసం రవిప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు నిరాకరించింది. దీంతో ఈ కేసులను కొట్టేయాలని కోరుతూ రవిప్రకాశ్ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో పోలీసుల ముందు హాజరయ్యారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
tv9
ravi prakash
High Court

More Telugu News