రోడ్డు ప్రమాదంలో వ్యవసాయాధికారి మృతి: శ్రీకాకుళం జిల్లాలో విషాదం
- మందస మండలం మధనాపురంలో ఘటన
- పెట్రోల్ బంక్ వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు
- పలాస మండల వ్యవసాయ శాఖ సంచాలకుడు మృతి
ఆగివున్న లారీని కారు ఢీకొట్టిన ప్రమాదంలో వ్యవసాయాధికారి ఒకరు దుర్మరణం పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం మధనాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు....పలాస వ్యవసాయ శాఖ సంచాలకుడిగా పనిచేస్తున్న చల్లా దశరథుడు (50) తన క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా కారులో బయలుదేరి వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న కారు మధనాపురం సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు రాగానే.. అక్కడ లారీ నిలిపి ఉన్న విషయాన్ని గుర్తించని కారు డ్రైవర్ దాన్ని ఢీకొట్టడంతో దశరథుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.