TSRTC: షోలాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో దగ్ధమైన తెలంగాణ ఆర్టీసీ బస్సు.. ఐదుగురి మృతి

  • పండర్‌పూర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన
  • ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు
  • కొంపముంచిన డ్రైవర్ నిద్రమత్తు
మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సు పండర్‌పూర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదానికి గురైంది. షోలాపూర్-పుణె జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. ఆ వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి.

క్షణాల్లోనే అవి విస్తరించి బస్సు, లారీలను బుగ్గి చేశాయి. ప్రమాదంలో ఆర్టీసీ బస్సులోని ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే షోలాపూర్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
TSRTC
Maharashtra
Road Accident
Pandarpur

More Telugu News