ప్రధాని మోదీ శాశ్వతంగా ఓ గుహలో ఉంటే దేశానికి చాలా మంచిది!: కాంగ్రెస్ నేత ఇళంగోవన్ సెటైర్లు

ప్రధాని మోదీ ఇటీవల కేదార్ నాథ్ పర్యటన సందర్భంగా ఓ గుహలో 20 గంటల పాటు ధ్యానం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నేత, తమిళనాడు పీసీసీ మాజీ చీఫ్ ఈవీకేఎస్ ఇళంగోవన్ వ్యంగ్యంగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ శాశ్వతంగా గుహలో ఉండటమే దేశానికి మంచిదని ఎద్దేవా చేశారు. తేని లోక్ సభ నియోజకవర్గంలో డీఎంకే-కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా పోటీచేసిన ఇళంగోవన్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

మే 23న ఫలితాల లెక్కింపు అనంతరం కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందనీ, రాహుల్ గాంధీ ప్రధానిగా బాధ్యతలను స్వీకరిస్తారని ఇళంగోవన్ ధీమా వ్యక్తం చేశారు.  తేనిలో ఎన్నడూ లేనవిధంగా రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు ఈసీ ఆదేశించిందనీ, దీన్ని కొన్ని పార్టీలు ఇష్టపడలేదని వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు బీజేపీకి ఈసారి మెజారిటీ స్థానాలు రాబోవని స్పష్టం చేశారు.


More Telugu News