Andhra Pradesh: లగడపాటిది సర్వే కాదు ‘చిలకజోస్యం’: విష్ణుకుమార్ రాజు
లగడపాటి రాజగోపాల్ సర్వేపై విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ, ఆయన సర్వే ‘చిలకజోస్యం’గా అభివర్ణించారు. ఢిల్లీలో ఏపీ భవన్ లో చంద్రబాబును బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ని పలకరించిన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికలప్పుడు లగడపాటి సర్వే చూసి ‘ఇదంతా బోగస్’ అని నాడే చెప్పానని అన్నారు. ఇప్పుడు చెప్పబోయే సర్వే కూడా అలాంటిదేనని, అసలు, సర్వే చేయించారా? అని ప్రశ్నించారు. వాళ్లూవీళ్లూ చెప్పిన మాటలను అనుసరించి లగడపాటి చెబుతున్నారే తప్ప సర్వే చేయించారని తాను అనుకోవట్లేదని అన్నారు. ఆ సర్వేకు తాను ఏమాత్రం విలువ ఇవ్వనని అన్నారు. లగడపాటి సర్వేను చూసి ప్రజలు మోసపోవద్దని, బెట్టింగ్స్ కు పాల్పడవద్దని విష్ణుకుమార్ రాజు సూచించారు.