జోరు పెంచిన ఎన్నికల సంఘం.. నేడు విజయవాడలో కౌంటింగ్ పై శిక్షణా కార్యక్రమం!

  • హాజరుకానున్న లోక్ సభ, అసెంబ్లీ ఆర్వోలు
  • ఉదయం పదిన్నర నుంచి 11.30 గంటల వరకూ శిక్షణ
  • హాజరు కానున్న ద్వివేది, సుజాత శర్మ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 23న జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు ఏపీ ఎన్నికల సంఘం సిద్ధమయింది. ఈరోజు విజయవాడలోని గురునానక్ కాలనీ ఎన్ఏసీ కల్యాణ మండపంలో ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకూ ఓట్ల లెక్కింపుపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 లోక్ సభ నియోజకవర్గాలకు చెందిన రిటర్నింగ్ అధికారులు(ఆర్వో) పాల్గొంటారు.

వీరితో పాటు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి సుజాత శర్మ కూడా పాల్గొంటారు. ఈ నెల 23న కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. తొలుత ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకూ ఆర్వోలకు కౌంటింగ్ పై శిక్షణ ఇస్తామని ఈసీ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

ఆ తర్వాత 11.30 నుంచి 12 గంటల వరకూ ఈటీపీబీఎస్ పై శిక్షణ ఉంటుందన్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సమావేశ ప్రాంగణంలో మోడల్ కౌంటింగ్ కేంద్రం సందర్శన ఉంటుందని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Andhra Pradesh
election commission
Vijayawada
counting
training

More Telugu News