rohit shekar: ఒక మహిళతో కలసి మందు తాగినందువల్లే రోహిత్ శేఖర్ ను అపూర్వ హత్య చేసింది: పోలీసులు

  • మహిళా బంధువుతో కలసి మందు తాగిన రోహిత్
  • భార్యాభర్తల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ
  • మందు మత్తులో తనను తాను రక్షించుకోలేకపోయిన రోహిత్
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారి కుమారుడు రోహిత్ శేఖర్ ను అతని భార్య అపూర్వ హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్యకు గల కారణాలను ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. తన బంధువైన ఒక మహిళతో కలసి మందు తాగినందువల్లే అతన్ని అపూర్వ చంపేసిందని తెలిపారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు రోహిత్ శేఖర్ ఉత్తరాఖండ్ లోని కాత్ గోడమ్ కు వెళ్లారు. ఏప్రిల్ 15న రోహిత్, అతని తల్లి ఉజ్వల, బంధువైన ఒక మహిళ తిరుగుపయనమయ్యారు. ప్రయాణంలో మహిళా బంధువుతో కలసి రోహిత్ మందు తాగాడు. ఇదే సమయంలో రోహిత్ కు అపూర్వ వీడియో కాల్ చేసింది. ఈ సందర్భంగా మహిళతో కలసి మందు తాగుతున్న సన్నివేశాలను ఆమె చూసింది.

ఢిల్లీలోని ఇంటికి వచ్చిన తర్వాత ఇదే అంశంపై రోహిత్, అపూర్వల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. అనంతరం మొదటి అంతస్తులో ఉన్న తన గదిలోకి రోహిత్ వెళ్లాడు. అతను నిద్రలోకి జారుకున్న తర్వాత దిండుతో ఊపిరాడకుండా చేసి అపూర్వ హత్య చేసింది. మందు మత్తులో ఉండటం వల్ల రోహిత్ తనను తాను రక్షించుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయాడు.

మరోవైపు, అపూర్వకు పెళ్లికి ముందే మరో వ్యక్తితో సంబంధం ఉందని రోహిత్ తల్లి ఉజ్వల ఆరోపిస్తున్నారు.

More Telugu News

rohit shekar
ujwala
apoorva
murder
nd tiwari