టీడీపీ, వైసీపీల్లా ‘జనసేన’ లెక్కలు వేసుకోదు: పవన్ కల్యాణ్
ఎన్నికలు పూర్తయిన వెంటనే టీడీపీ, వైసీపీ లు తమకు ఇన్ని స్థానాలు వస్తాయంటే ఇన్ని స్థానాలు వస్తాయంటూ లెక్కలు వేస్తూ ప్రకటనలు చేశారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, తాము మాత్రం టీడీపీ, వైసీపీల్లా లెక్కలు వేయమని, పోలింగ్ సరళి ఎలా జరిగిందో తెలుసుకోమని మాత్రమే పార్టీ నాయకులకు చెప్పామని అన్నారు. జనసేన పార్టీకి అండగా, మద్దతుగా నిలిచిన వారికి కృతఙ్ఞతలు చెప్పడం మాత్రం మరిచిపోవద్దని ఎన్నికల్లో పోటీ చేసిన తమ అభ్యర్థులకు సూచించారు. ప్రతి గ్రామానికి ఓ రోజు కేటాయించి వారిని కలవాలని, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవాలని చెప్పారు.