Telangana: భార్యపై అనుమానం.. కొబ్బరిబొండాల కత్తితో దాడి.. కుమారుడి మృతి

  • దాడి అనంతరం ఫ్యాన్‌కు ఉరేసుకున్న భర్త
  • కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భార్య
  • పటాన్‌చెరులో ఘటన

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కొబ్బరిబొండాల కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనలో తొమ్మిదేళ్ల కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, భార్య ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా వసంతవాడకు చెందిన రుద్రరాజు సుబ్బరాజు (47) ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అతడికి ఇప్పటికే పెళ్లికాగా విభేదాల కారణంగా భార్యకు విడాకులిచ్చాడు.

గతంలో హత్యకేసులో సుబ్బరాజు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఏడాది క్రితం పశ్చిమ గోదావరి జిల్లా దువ్వ గ్రామానికి చెందిన చెందిన లక్ష్మీజ్యోతిని రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటికే పెళ్లయిన ఆమెకు చైతన్య అనే తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లి తర్వాత పటాన్‌చెరు మండలం చిట్కుల్‌లోని నాగార్జున కాలనీలో కాపురం పెట్టారు.

ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న సుబ్బరాజు ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అమె ప్రవర్తన అనుమానంగా ఉందంటూ తన డైరీలోనూ రాసుకోవడం విశేషం. ఈ క్రమంలో ఈ నెల 19న భార్యతో మరోమారు ఇదే విషయమై గొడవపడ్డాడు. ఆమె నిద్రపోయిన తర్వాత కొబ్బరి బొండాల కత్తితో ఆమెపై దాడి చేశాడు. కత్తివేటుకు ఆమె స్పృహతప్పి పడిపోగా, ఆ తర్వాత ఆమె కుమారుడు చైతన్యపైనా దాడిచేశాడు. నిద్రలో ఉన్న చైతన్య మంచంపైనే ప్రాణాలు వదిలాడు.

ఇద్దరూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకున్నాడు. ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న జ్యోతిని గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే జ్యోతి, ఆమె కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. జ్యోతి ప్రాణాలతో పోరాడుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News