జమ్మలమడుగులో వైసీపీ-టీడీపీ శ్రేణుల ఘర్షణ.. అడ్డువెళ్లిన పోలీసులపై కూడా దాడి!
- ఉన్నతాధికారులకు సమాచార మిచ్చిన స్థానిక పోలీసులు
- అదనపు బలగాలతో అక్కడకు బయలుదేరిన ఎస్పీ
- నేటితో ముగియనున్న పోలింగ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడి చేసుకున్నాయి. దీంతో ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగగా వారిపై రెండు గ్రూపులు కలిసి దాడికి పాల్పడ్డాయి. దీంతో స్థానిక పోలీసులు జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి అదనపు బలగాలతో అక్కడకు బయలుదేరారు. జమ్మలమడుగు స్థానంలో టీడీపీ నుంచి రామసుబ్బారెడ్డి, వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నేటితో ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు పూర్తికానున్నాయి. ఫలితాలను మే 23న ప్రకటించనున్నారు.