ఆర్కేను గెలిపించండి, మంత్రి పదవి ఇస్తా... నేతన్నకు ఏడాదికి రూ. 24 వేలు: జగన్ హామీ

గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున నిలబడిన ఆర్కేను గెలిపిస్తే, తన క్యాబినెట్ లోకి తీసుకుంటానని ప్రజలకు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆర్కే ఈ ప్రాంతానికి చెందిన వారేనని, ప్రజల సమస్యలు అతనికి తెలుసునని, అన్నింటినీ పరిష్కరిస్తారని చెప్పారు. ఈ ఉదయం మంగళగిరిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన జగన్, ఇక్కడి నేతన్నలకు కీలక హామీలను కూడా ఇచ్చారు.

వైసీపీ అధికారంలోకి వస్తే, గుంటూరు జిల్లా నుంచి ఇచ్చే తొలి ఎమ్మెల్సీ పదవిని మంగళగిరి చేనేత వర్గానికి చెందిన వ్యక్తికే ఇస్తానని అన్నారు. ఏడాదికి ఒక్కో నేతన్న కుటుంబానికి రూ. 24 వేల ఆర్థిక సాయం చేస్తానని చెప్పారు. చంద్రబాబుకు ఓటేస్తే, రాష్ట్ర ప్రజలు మరింతగా నష్టపోతారని, వెన్నుపోటు, అవినీతి, అరాచకాలకు కేరాఫ్ గా ఉన్న టీడీపీ సర్కారును తరిమికొట్టాలని ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు. 'పసుపు - కుంకుమ' పేరిట మహిళలను మభ్యపెడుతున్నారని, మహిళలకు రుణమాఫీ చేస్తానని మోసం చేశారని జగన్ ఆరోపించారు.


More Telugu News