Jana Sena: జనసేన గాజు గ్లాసు గుర్తు రద్దయిందంటూ విపరీతంగా ప్రచారం.. ఖండించిన పార్టీ!

షార్ట్స్‌లో చూడండి
గత ఎన్నికల సమయంలో పురుడుపోసుకున్న జనసేన పార్టీ ఈసారి ఎన్నికల బరిలో పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గాజుగ్లాసు గుర్తును కేటాయించింది. అయితే, సామాజిక మాధ్యమాల్లో జనసేన పార్టీ గుర్తుపై విపరీతమైన ప్రచారం మొదలైంది.

గ్లాసు గుర్తును రద్దు చేశారని, కొత్తగా జనసేన పార్టీకి బ్లేడు గుర్తు కేటాయించారంటూ కథనాలు తెరపైకి వచ్చాయి. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక లెటర్ హెడ్ తో ఉన్నట్టుగా ఓ ప్రెస్ నోట్ వైరల్ అవుతోంది. అది నిజమే అని నమ్మిన నెటిజన్లు విపరీతంగా షేర్ చేయడం మొదలుపెట్టారు. అప్పటికే సోషల్ మీడియాలో విషయం బాగా పాకిపోవడంతో జనసేన వర్గాలు వెంటనే స్పందించాయి.

అది నకిలీ ప్రెస్ నోట్ అని, జనసేన గాజు గ్లాసు గుర్తు రద్దు కాలేదని, జరుగుతున్నదంతా దుష్ప్రచారమేనని జనసేన పార్టీ అధినాయకత్వం స్పష్టం చేసింది. కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకే ఇలాంటి కుట్రలు జరుగుతుంటాయని, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్ని సందర్భాల్లో జనసేన అగ్రనేతల సంతకాలు కూడా ఫోర్జరీ చేస్తున్నారని వివరించింది. తమ పార్టీ గుర్తు గాజు గ్లాసేనని, అందులో ఎలాంటి మార్పులేదని మరోసారి ఉద్ఘాటించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ ప్రెస్ నోట్ ఇదే...
Go Back to Shorts
Jana Sena
Pawan Kalyan

More Telugu News