ayodhya: ‘అయోధ్య’ స్థల వివాదం కేసు.. మధ్యవర్తి నియామకంపై మార్చి 5న నిర్ణయం: ‘సుప్రీం’ ధర్మాసనం

  • ఈ వివాదం మధ్యవర్తి ద్వారా పరిష్కారమవుతుందంటే నియమిస్తాం
  • అందుకు సిద్ధంగా ఉన్నాం
  • సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం
అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం పరిష్కారం నిమిత్తం మధ్యవర్తిని నియమించే అంశంపై మార్చి 5న ఓ నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎన్.ఎ. బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యు.లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్ లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై ఈరోజు విచారణ ప్రారంభించింది.

న్యాయస్థానం నియమించే మధ్యవర్తి ద్వారా ఈ వివాదం పరిష్కారానికి ఒక్క శాతం అవకాశమున్నా.. నియమించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. మధ్యవర్తిని నియమించాలా? వద్దా? అన్న అంశంపై మార్చి 5న నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. గత కొన్నేళ్లుగా కొన సాగుతున్న ఈ వివాదాన్ని సీరియస్ గా తీసుకోరా? అని మధ్యవర్తి ఏర్పాటు వద్దని వ్యతిరేకిస్తున్న కొన్ని ముస్లిం, హిందూ పార్టీలను ధర్మాసనం ప్రశ్నించింది.

ఈ వివాదానికి సంబంధించి స్థలం హక్కుల గురించి మాత్రమే తాము నిర్ణయం తీసుకోగలమని స్పష్టం చేసింది. ఈ వివాదాస్పద స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలను కక్షిదారులకు ఆరు వారాల్లోగా సమర్పించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అన్ని పార్టీలు ఈ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, తమ అభ్యంతరాలను తెలియజేయాలని ధర్మాసనం తెలిపింది.ఈ పత్రాల పరిశీలనకు ఎంత సమయం కావాలని ముస్లిం పార్టీలను ధర్మాసనం ప్రశ్నించగా, 8 నుంచి 12 వారాలు కావాలని వారి తరపున న్యాయవాది ధావన్ కోరారు. ఎనిమిది వారాల తర్వాత మళ్లీ విచారణ చేపడతామని, ఈలోగా కక్షిదారులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తమకు తెలియజేయవచ్చని ధర్మాసనం చెప్పింది.
ayodhya
rama janma bhumi
babri mosque
apex court
cji
ranjan gogoi
nv ramana

More Telugu News