rabert vadra: ప్రజాసేవ చేయాలన్న ఆలోచన ఉంది: రాహుల్‌ బావ రాబర్డ్‌ వాద్రా

  • నా అనుభవాలు దేశానికి ఉపయోగపడాలి
  • రాజకీయాల్లోకి రానున్నట్లు సూచాయగా వెల్లడి
  • ఇటీవలే ఆయన భార్య ప్రియాంక అరంగేట్రం
రాహుల్‌ గాంధీ బావ, ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్‌వాద్రా రాజకీయాల్లోకి రావాలన్న తన ఆసక్తిని సూచాయగా వెల్లడించారు. ఇన్నేళ్ల తన అనుభవంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ఇవన్నీ సద్వినియోగం కావాలంటే ప్రజాసేవ చేయాలన్న ఆలోచన తనకు ఉందని తెలిపారు. రాజకీయాల్లోకి రానున్నట్లు నేరుగా చెప్పకపోయినా మరో రూపంలో తన ఆసక్తిని ఆయన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. మనీలాండరింగ్‌, భూ ఆక్రమణ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వాద్రా ఇటీవలే ఈడీ ఎదుట పలుమార్లు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ‘ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న అపవాదులు, ఆరోపణలకు తెరపడగానే ప్రజాసేవకు అంకితం అయ్యేలా పెద్ద పాత్ర పోషించాలని ఉంది’ అంటూ పేర్కొన్నారు.

ఏళ్లపాటు ప్రచారంలో గడిపానని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా యూపీలో పనిచేశానని, ఆ సమయంలో ప్రజలు నాపై చూపిన సహజ సిద్ధమైన ప్రేమ, ఆప్యాయతలను మర్చిపోలేనని తెలిపారు. రాబర్ట్‌వాద్రా భార్య ప్రియాంకా గాంధీని ఇటీవలే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించి ఉత్తరప్రదేశ్‌ బాధ్యతలను ఆమెకు రాహుల్‌గాంధీ అప్పగించారు. ఇప్పుడు బావ కూడా రాజకీయాల్లో రావాలని ఆసక్తి చూపుతుండడంతో రాహుల్‌ గాంధీ ఆయనకు మరే బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి.
rabert vadra
political
Uttar Pradesh

More Telugu News