alka lamba: నన్ను బలహీనపరుస్తున్నారు: ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబా

  • కాంగ్రెస్ లో చేరబోతున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • చాందినీ చౌక్ నుంచి మరో వ్యక్తిని బరిలోకి దింపాలనుకుంటున్నారు
  • కాంగ్రెస్, ఆప్ లు కలసి పోటీ చేసే అవకాశం ఉంది

ఆప్ నాయకత్వంపై ఆ పార్టీ ఢిల్లీ చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కా లాంబా విమర్శలు గుప్పించారు. తనను బలహీనపరిచేందుకు పార్టీ నేతలు యత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నానంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. దివంగత రాజీవ్ గాంధీకి భారతరత్న అంశాన్ని తాను లేవనెత్తానని... దీంతో, గత డిసెంబరులో తనను రాజీనామా చేయాలని పార్టీ హైకమాండ్ ఆదేశించిందని చెప్పారు. అయితే, ఆమె చేసిన ఆరోపణలను ఆప్ ఖండించింది.

ఫిబ్రవరి 20న తన నియోజకవర్గంలో ఉన్న జామా మసీదు సమీపంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ సభ జరగనుందని... స్థానిక ఎమ్మెల్యేను అయినా, తనను ఆ కార్యక్రమానికి ఆహ్వానించలేదని అల్కా వాపోయారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో చాందినీ చౌక్ నుంచి మరో వ్యక్తిని బరిలోకి దింపే యోచనలో నాయకత్వం ఉందని దుయ్యబట్టారు. తనను బలహీనపరచడం ద్వారా పార్టీ ఎలా బలపడాలనుకుంటుందో తనకు అర్థం కావడం లేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ లు కలసి పోటీ చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని ఆమె తెలిపారు.

More Telugu News