జనసేనలో చేరనున్న అవనిగడ్డ కాంగ్రెస్ ఇన్ ఛార్జి మత్తి వెంకటేశ్వరరావు?
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి మత్తి వెంకటేశ్వరరావు పార్టీ సభ్యత్వానికి, పీసీసీ సభ్యత్వానికి, ఇన్ ఛార్జి పదవికి రాజీనామా చేశారు. ఐదేళ్ల పాటు నియోజకర్గ ఇన్ ఛార్జ్ గా కీలకపాత్ర పోషించిన ఆయన రాజీనామా చేయడంతో కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తగిలినట్టైంది. మరోవైపు, జనసేనలో చేరేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంగా మీడియాతో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. పీసీసీ, డీసీసీ అధ్యక్షులకు తన రాజీనామా లేఖలను పంపించానని చెప్పారు.