రాష్ట్రంలో ప్రధాని పర్యటనను అడ్డుకుంటాం: వామపక్షాలు
- బెజవాడలో ఖాళీ కుండలతో నిరసన
- మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు
- ఎవరి స్థాయిలో వారు అడ్డుకోవాలని పిలుపు
రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసి, ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రంలో సభలు నిర్వహిస్తారని ప్రధాని నరేంద్రమోదీని వామపక్షాలు ప్రశ్నించాయి. ఆయన పర్యటనను రాష్ట్రంలో అడ్డుకుంటామని ప్రకటించాయి. గుంటూరులో ఆదివారం మోదీ సభ జరగనున్న నేపథ్యంలో ఈరోజు బెజవాడలో వామపక్షాలు ఖాళీ కుండలతో నిరసన తెలియజేసి అనంతరం వాటిని పగులగొట్టాయి. ‘మోదీ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఎం, సీపీఐ రాష్ట్ర నేతలు మధు, రామకృష్ణలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న అన్ని రాష్ట్రాల పట్ల కేంద్రం వైఖరి ఒకేలా ఉందన్నారు. దీన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తమ నిరసనను తెలియజేస్తామని, అరెస్టులకు కూడా భయపడమని స్పష్టం చేశారు. ఆయా పార్టీలు, ప్రజా సంఘాలు కూడా తమ తమ స్థాయుల్లో మోదీ పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.