Bollywood: నా దృష్టి సినిమాల మీదే.. రాజకీయ ప్రవేశంపై వార్తలను ఖండించిన నటి కరీనా కపూర్

  • భోపాల్ నుంచి లోక్‌సభకు కరీనా
  • కాంగ్రెస్ అభ్యర్థి అంటూ ప్రచారం
  • రాజకీయాలపై ఆసక్తి లేదన్న బాలీవుడ్ నటి

తన రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న వార్తలపై  బాలీవుడ్ ప్రముఖ నటి కరీనా కపూర్ స్పందించింది. తనకు అలాంటి ఉద్దేశమేదీ లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని, రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి నటి కరీనా కపూర్‌ను కాంగ్రెస్ బరిలోకి దించాలని యోచిస్తున్నట్టు సోమవారం ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి.

భోపాల్‌లో బీజేపీని ఓడించడానికి కరీనా కపూరే సరైన వ్యక్తి అని పేర్కొంటూ కార్పొరేటర్ యోగేంద్ర సింగ్ చౌహాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాసినట్టు వార్తలు బయటకు వచ్చాయి. అంతేకాదు, ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో కూడా ఈ విషయమై చర్చించేందుకు ఆయన రెడీ అవుతున్నట్టు కథనాలు వెలువడ్డాయి. దీంతో స్పందించిన కరీనా ఆ వార్తలను ఖండించింది. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని తేల్చి చెప్పింది. ఆ వార్తలు పూర్తిగా నిరాధారమని కరీనా పేర్కొంది.

More Telugu News