Andhra Pradesh: మాటలు రాని బుల్ బుల్ బాలకృష్ణ కూడా విమర్శలు చేయడం హాస్యాస్పదం!: శిల్పా చక్రపాణి రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఓ సంచలనమని ఆ పార్టీ నంద్యాల పార్లమెంట్‌ ఇంచార్జి శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు. ఏపీలో ప్రతీ రాజకీయ వర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రమంతటా పర్యటించి అన్నివర్గాల సమస్యలు తెలుసుకున్న ఏకైక నాయకుడు జగనేనని ప్రశంసించారు. కర్నూలు జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఎఫెక్ట్ చంద్రబాబుపై పడిందని శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు. నవరత్నాల ప్రకటనతో చంద్రబాబుకు మతి భ్రమించిందని వ్యాఖ్యానించారు. అధికారం కోసమే చంద్రబాబు పెన్షన్ ను పెంచారని ఆరోపించారు. మాటలు సరిగ్గా రాని బుల్‌ బుల్‌ రాజా బాలకృష్ణ కూడా ప్రతిపక్షాలను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన వాళ్లు బాలకృష్ణ కుటుంబంలోనే ఉన్నారని చక్రపాణి రెడ్డి తెలిపారు.

తెలంగాణ ప్రజల తరహాలో ఏపీ ప్రజలు కూడా చంద్రబాబును రాజకీయ సమాధి చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. గతంలో కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన చంద్రబాబు మళ్లీ అదే పార్టీతో జతకట్టడం సిగ్గు చేటన్నారు. అసెంబ్లీలో రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్లు లేనందుకే తాము సమావేశాలకు హాజరుకావడం లేదన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ,  రెండు పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
Balakrishna
criticise

More Telugu News