Andhra Pradesh: కొత్త రాజధానికి రూ.5 లక్షల కోట్లు కావాలని అప్పుడే చెప్పా.. అమరావతితో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి!: చంద్రబాబు

  • ఆంధ్రాను 617 అవార్డులు వరించాయి
  • అమరావతి తొలిదశకు రూ.51 వేల కోట్లు అవసరం
  • రాజధాని పూర్తయ్యేందుకు 20 ఏళ్లు పడుతుంది

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమమైన తొలి 5 నగరాల్లో ఒకటిగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనివల్ల ఏపీలో భారీగా ఉద్యోగాలను సృష్టించవచ్చని వెల్లడించారు. అమరావతి తొలిదశను పూర్తిచేయడానికి రూ.51,000 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. రెండో దశకు మరో రూ.50 వేల కోట్లు కావాల్సి ఉంటుందని అన్నారు. ఓ రాజధాని కట్టాలంటే కనీసం రూ.5 లక్షల కోట్లు కావాలని తాను గతంలో చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. ఏపీలో ‘ఇంధనం-మౌలిక రంగాల్లో అభివృద్ధి’పై చంద్రబాబు ఈ రోజు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.

ఓ రాజధాని ఏర్పాటు అయ్యేందుకు 20 ఏళ్లు పడుతుందని చెప్పారు. అమరావతి తొలిదశ పనులకు అవసరమైన నిధుల్లో రూ.40,000 కోట్లకు పైగా సమీకరించుకున్నామనీ, పనులు సైతం శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. అమరావతి నిర్మాణంతో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలుగా గుర్తింపు పొందిన విట్, ఎస్ఆర్ఎమ్, అమృత వర్సిటీ వంటి సంస్థలు ఇప్పటికే అమరావతిలో తమ క్యాంపస్ లను ఏర్పాటు చేశాయని చంద్రబాబు గుర్తుచేశారు.

అమరావతిలో ఇంటర్నేషనల్ స్కూల్స్, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల స్థాపనకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ఏపీలో ఆరోగ్య, విద్యా రంగాల్లో దేశానికే హబ్ గా మారుస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వానికి వేర్వేరు రంగాల్లో ఇప్పటివరకూ 617 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయని వెల్లడించారు.

More Telugu News