Telangana: ప్రభాస్ గెస్ట్ హౌస్ జప్తు వ్యవహారం.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు!

  • గత బుధవారం సీజ్ చేసిన అధికారులు
  • గెస్ట్ హౌస్ ప్రభుత్వ భూమిలో ఉందని వెల్లడి
  • క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేశామన్న ప్రభాస్

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గం పన్మక్త గ్రామంలో హీరో ప్రభాస్ కు చెందిన గెస్ట్ హౌస్ ను అధికారులు జప్తు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తన ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులను నియంత్రించాలని ప్రభాస్ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్థలాన్ని 2005లో బి.వైష్ణవిరెడ్డి, ఉషా, బొమ్మిరెడ్డి శశాంక్‌రెడ్డిల నుంచి చట్టబద్ధంగా కొనుగోలు చేశామనీ, ఈ భూమిపై ఎటువంటి వివాదాలు లేవని ప్రభాస్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. తాజాగా ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్ ను ఈరోజు ఉమ్మడి హైకోర్టు విచారించింది.

ఈ సందర్భంగా ప్రభాస్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఎటువంటి వివాదాలు లేకపోయినా ముందు జాగ్రత్తగా ఈ భూమి క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నామని కోర్టుకు తెలిపారు. ఇందుకోసం రూ. 1.05 కోట్ల ఫీజును కూడా చెల్లించామని వెల్లడించారు. ఈ దరఖాస్తు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉందని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు తమ భూమిని బలవంతంగా ఖాళీ చేయించేందుకు యత్నిస్తున్నారని అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.

More Telugu News