Chidambaram: ఐఎన్ఎక్స్ మీడియా కేసు.. ఈడీ ఎదుట హాజరైన చిదంబరం

షార్ట్స్‌లో చూడండి
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఈ రోజు ఈడీ ఎదుట హాజరయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఇటీవల ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. చిదంబరం కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో రూ.3,500  కోట్ల ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ ఒప్పందం, రూ.305 కోట్ల ఐఎన్ఎక్స్ మీడియా ఒప్పందాలు జరిగాయి.

అయితే వీటిల్లో అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలో మంత్రి అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును ఈడీ, సీబీఐ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆయన ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఈ కేసులో చిదంబరానికి ముందస్తుగానే కోర్టులో ఉపశమనం లభించింది. జనవరి 15 వరకు ఆయనను అరెస్ట్ చేయరాదంటూ ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
Go Back to Shorts
Chidambaram
Congress

More Telugu News