కృష్ణా జిల్లాలో దారుణం.. కన్నకుమారుడికి ఉరి వేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి!
- అనారోగ్యంతో మంచం పట్టిన సాయి
- చికిత్స చేయించినా ఫలితం శూన్యం
- కన్నీరుమున్నీరవుతున్న కుటుంబీకులు
ప్రకాశ్ నగర్లో కూల్డ్రింక్ షాప్ వ్యాపారి అయిన సూరాబత్తుల విష్ణుమూర్తి(40)కి విజయలక్ష్మి అనే మహిళతో 23 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి సాయికుమార్(22) అనే కుమారుడు, భవాని అనే కూమార్తె ఉన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సాయికుమార్ రెండేళ్ల క్రితం అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యాడు. వైద్య పరీక్షలు చేయించగా శరీరంలోని కొన్ని భాగాల్లో రక్తప్రసరణ ఆగిపోయిందని తేలింది. దీంతో దాదాపు రూ.20 లక్షలు ఖర్చుపెట్టి కుమారుడికి వైద్యం చేయించారు.
అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి లోనైన విష్ణుమూర్తి తాను చనిపోతే కుమారుడికి సపర్యలు చేసేవాళ్లు, వైద్యం చేయించేవాళ్లు ఉండరని విపరీతంగా బాధపడ్డాడు. అనంతరం కొడుక్కి ఉరివేసి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, విష్ణుమూర్తి, సాయికుమార్ చనిపోవడంతో మిగతా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.