Chandrababu: కలసి నడుద్దామంటే ముందుకు రాని కేసీఆర్: ట్విట్టర్ లో చంద్రబాబు నిప్పులు

  • మోదీతో కలసి లాలూచీ రాజకీయాలు
  • ఒక్క మంచి పనికూడా చేయలేకనే నాపై విమర్శలు
  • వరుస ట్వీట్లలో చంద్రబాబునాయుడు
ప్రధాని నరేంద్ర మోదీతో కలసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు పెట్టిన ఆయన, కేసీఆర్ తనతో కలసి రాలేదని విమర్శించారు.

 "కేంద్రం అన్యాయం చేసినా తెలుగుజాతిగా కలిసి పనిచేద్దాం అంటే కేసీఆర్ కలిసి రాకపోగా, మోదీతో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక్క మంచి పనిచేయలేక ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నారు" అని ఆయన అన్నారు.

"అన్ని వనరులున్నా సమర్థవంతమైన నాయకత్వం లేక తెలంగాణ రాష్ట్రం నేడు సమస్యలు ఎదుర్కొంటోంది. ఇబ్బందులు పడుతోంది. అందుకే టీఆర్ఎస్‌కు బుద్ది చెప్పాలని, సమర్థవంతమైన నాయకత్వం కావాలని ప్రజాకూటమికి మద్దతిస్తున్నాము" అని చెప్పారు. "ఈ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు త్యాగాలు చేస్తూ పల్లకీ మోస్తున్నారంటే.. కారణం కేవలం ప్రజలే. పదవులు ఆశించకుండా ప్రజలకు మేలు జరగాలని శ్రమిస్తున్నారు. కూటమి గెలిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని పాటుపడుతున్నారు" అని చంద్రబాబు అన్నారు.




More Telugu News

Chandrababu
Narendra Modi
KCR
Twitter