gali janardhan reddy: నా ప్రాణాలకు ముప్పు ఉంది.. కుమారస్వామి రాక్షసానందం పొందుతున్నారు: గాలి జనార్దన్ రెడ్డి

  • రాజకీయ దురుద్దేశంతోనే నన్ను తప్పుడు కేసులో ఇరికించారు
  • అనంతకుమార్ కు నివాళి కూడా అర్పించలేకపోయా
  • కుమారస్వామి రాక్షసానందం పొందుతున్నారు

అంబిడెంట్ కేసులో నాలుగు రోజులుగా బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తనకు వ్యతిరేకంగా ఏదో కుట్ర జరుగుతోందని అన్నారు. తప్పుడు కేసులతో తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. కర్ణాటకలో తన ప్రాణాలకు ముప్పు ఉందని... తనకు తగిన రక్షణ కల్పించాలని విన్నవించారు.

రాజకీయ దురుద్దేశంతోనే తనను ఈ కేసులో ఇరికించారని గాలి మండిపడ్డారు. అంబిడెంట్ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని... చివరకు న్యాయమే గెలుస్తుందని చెప్పారు. జైల్లో ఉన్న కారణంగా చివరకు కేంద్ర మంత్రి అనంతకుమార్ కు నివాళి కూడా అర్పించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 2001లో అనంతకుమార్ బళ్లారిలోని తమ నివాసానికి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

అన్ని కేసుల నుంచి ఏడాదిలోగా విముక్తి పొందుతానన్న ఆశాభావాన్ని గాలి వ్యక్తం చేశారు. తనపై తప్పుడు కేసులు వేయించి ముఖ్యమంత్రి కుమారస్వామి రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. ఆ రాక్షస నవ్వు ఎంతో కాలం ఉండదని చెప్పారు.

More Telugu News