అవినీతి అని గగ్గోలు పెట్టారు.. నిరూపించమంటే ప్యాకప్ అన్నారు!: పవన్ పై లోకేశ్ సెటైర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం జగ్గంపేటలో నిర్వహించిన సభలో వంతాడ బాక్సైట్ తవ్వకాలపై ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. లాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు చేస్తున్నారని.. అడ్డగోలుగా వ్యవహరిస్తున్న కంపెనీలను అడ్డుకుంటామన్నారు. పవన్ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. పవన్ ను విమర్శిస్తూ రెండు వరుస ట్వీట్స్ చేశారు.

ఈ ట్వీట్స్‌లో పవన్‌ను మోదీ దత్తపుత్రుడిగా లోకేశ్ అభివర్ణించారు. ‘‘మోదీ దత్త పుత్రుడి అబద్ధపు ప్రచారం. అవినీతి అని గగ్గోలు పెట్టారు. నిరూపించమంటే ప్యాకప్ అన్నారు. ఇప్పుడు మరో సారి బాక్సైట్ మసి పూసే ప్రయత్నం చేస్తున్నారు. పదవి కోసం తప్పుడు ప్రచారం మాని ఆధారాలు ఉంటే బయటపెట్టమని సవాల్ చేస్తున్నా. మోదీ ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేసారంటూ మీరు ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినా, ఎందుకు  ప్రశ్నించడం లేదు? ఆ రిపోర్ట్ ఎక్కడ దాచారు?’’ అని ప్రశ్నించారు.


More Telugu News