Toddy Shop: ఒంటరి యువతిని బస్టాప్ లో దింపుతానని చెప్పి... స్నేహితులతో కలసి అత్యాచారం!

  • రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ సమీపంలో ఘటన
  • బంధువులతో కలిసి కల్లు తాగిన యువతి
  • దింపుతానంటూ బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లిన యువకుడు
  • ఆపై స్నేహితులను పిలిపించి అత్యాచారం

తన బంధుమిత్రులతో కలసి కల్లుతాగిన ఓ యువతిని, బస్టాప్ వరకూ దించుతానని చెప్పిన ఓ వ్యక్తి, తన బైక్ ఎక్కించుకుని, ఇంటికి తీసుకెళ్లి స్నేహితులతో కలసి అత్యాచారం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ లో జరిగింది. గత అర్ధరాత్రి కీచకుల బారినుంచి తప్పించుకున్న ఆమె, 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చి, ప్రాణాలతో బతికింది. మోయినా బాద్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, భర్త నుంచి విడిపోయి, తుక్కుగూడలో కూలి పని చేసుకునే 25 ఏళ్ల యువతి, శంషాబాద్ కు వెళ్లింది. బంధువులతో కలసి కల్లు దుకాణానికి పోయి, కల్లు తాగింది.

అక్కడి నుంచి ఇల్లు చేరేందుకు బయలుదేరగా, అమ్డాపూర్ గ్రామానికి చెందిన బాత్కు జైపాల్ ఆమెను పలకరించాడు. బస్టాపులో దించుతానని చెప్పి, బైక్ ఎక్కించుకుని, తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆపై బెదిరించి, అత్యాచారం చేయడంతో పాటు, తన స్నేహితులు మహేందర్, యాదగిరి, కృష్ణలను పిలిచాడు. వీరంతా ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అర్థరాత్రి బయటపడిన ఆమె, పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చేసరికే నలుగురూ అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు, వైద్య పరీక్షలు చేయించి, కేసు నమోదు చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని మొయినాబాద్‌ సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు.

More Telugu News