Telangana: ‘మహాకూటమి’ మేము అనుకున్న లైనులో నడవడం లేదు.. ఆరు సీట్లు ఇవ్వకుంటే కష్టమే!: సీపీఐ నేత చాడ

  • ఈ రోజు చాడ నివాసంలో నేతల భేటీ
  • పోటీ చేయాల్సిన స్థానాలపై చర్చ
  • జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తున్న సీపీఐ
తెలంగాణ ఎన్నికల కోసం ఏర్పాటైన మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కోసం నేతలు ఈ రోజు సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి నివాసంలో సమావేశం అయ్యారు. టీడీపీ తెలంగాణ చీఫ్ ఎల్.రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఈ సదస్సులో పాల్గొన్నారు. గత కొద్దిరోజులుగా మహాకూటమిలో సీట్ల పంపిణీ, పోటీ చేయాల్సిన స్థానాలపై నేతల మధ్య ఓ అంగీకారం రావడం లేదు.

ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని దేవరకొండ, ఖమ్మం జిల్లాలో వైరా, కొత్తగూడెం, హుస్నాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు స్థానాలను సీపీఐ ఆశిస్తోంది. అయితే గత ఎన్నికల్లో ఈ సీట్లలో సీపీఐ ఓడిపోయిన నేపథ్యంలో వీటిని కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరిస్తోంది.

మరోవైపు గెలిచే స్థానాలను వదులుకోవద్దని టీకాంగ్రెస్ నేతలకు సీనియర్లు, హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో పరిస్థితి జటిలంగా మారుతోంది. మహాకూటమి తరఫున ఏ పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే ఎవరెవరు, ఎక్కడి నుంచి పోటీచేయాలన్న విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో మహాకూటమి సమావేశం అనంతరం చాడ మాట్లాడుతూ.. తాము అనుకున్న లైన్లో కూటమి నడవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 6 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే కూటమిలో కొనసాగుతామని స్పష్టం చేశామన్నారు. ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్ఠంభనను తొలగించాల్సిన బాధ్యత కాంగ్రెస్ నేతలపైనే ఉందని తేల్చిచెప్పారు.
Telangana
maha kutami
cpi
Telugudesam
TJS
RAMANA
kodanda ram
chada venkata reddy

More Telugu News